Mahaa Daily Exclusive

  విత్తన చట్ట ముసాయిదా రూప కల్పనలో రైతుల అభిప్రాయాలే కీలకం వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి..!

Share

మహా : విత్తన చట్టం రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. కొత్తగా తీసుకురాబోతున్న విత్తన చట్టంలో ఎలాంటి అంశాలు చేర్చాలి అనే అంశాలపై ఈ సమావేశఁలో సుదీర్ఘంగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విత్తన చట్టాలపై అధ్యయనం చేయడంతోపాటు తెలంగాణలోని రైతుల నుండి సూచనలు సలహాలు తీసుకొని సమగ్ర విత్తన చట్టం రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. విత్తన చట్ట ముసాయిదాలో కీలకంగా రైతుకు విత్తన హక్కు కల్పించడం, నకిలీ విత్తనాలు అరికట్టడం, ఒకవేళ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఏవిదంగా నష్టపరిహారం చెల్లించాలి అనే అంశాలు ఈ రోజు జరిగిన సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల్లోని లోపాలపై కమిటీ సభ్యులు చర్చించారు.

చట్టం ముసాయిదా రూపొందించడానికి ముందు కమిటీ ఫీల్డ్ విజిట్ చేసి, రైతుల నుండి అభిప్రాయాలు, సూచనలు. సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో సమావేశాలు నిర్వహించాలని, సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు, డీలర్స్ తో కూడా దశల వారీగా చర్చించాలని భావిస్తున్నారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి విత్తన ముసాయిదాను రూపొందించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ముసాయిదాలో ఎలాంటి అంశాలు ఉండాలి, రైతుల నుండి వచ్చే సూచనలకు ప్రాధాన్యత ఇస్తూ.. విత్తన చట్ట ముసాయిదా రూపొందించాలని కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది..

ఈ సమావేశంలో విత్తన కమిటీ కన్వీనర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, కమిటీలో సభ్యులుగా ఉన్న సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, కమిషన్ సలహాదారులు దొంతి నర్సింహా రెడ్డి, రామాంజనేయులు, కమిటీ సభ్యులు గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి డైరెక్టర్ సీడ్ ఎంవీ నగేష్ కుమార్, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోవింద్ , వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.