Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఆశ్రయం ఇవ్వాలన్న పిటిషన్ రిజెక్ట్..!

Share

మహా : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌ రావుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తనపై రాజకీయ కక్షతో కేసు పెట్టిందని, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ గత ఏడాది నవంబర్ 29న అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ సమర్పించాడు. తాజాగా ఆ పిటిషన్‌ను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. తమ దేశంలో ఆశ్రయం కల్పించబోమని అమెరికా తేల్చిచెప్పింది.

మరోవైపు ప్రభాకర్‌ రావు జూన్ 20న నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశాలున్నాయి. ఇది ఆయనపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఇప్పటికే ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించడంలో కీలక అడుగులు పడ్డాయి. ఇంటర్‌పోల్ గత మార్చి 10న ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీని అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభాకర్ రావును భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ పూర్తి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఈ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర పోలీసు అధికారులపై ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు అరెస్టుతో ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన విషయాల ఆధారంగానే కేసు దర్యాప్తు వేగవంతమైంది.

ప్రభుత్వం మారిన తర్వాత అక్రమ ట్యాపింగ్ కు సంబంధించిన డేటాను పెద్ద ఎత్తున ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది, అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆయనను భారత్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. పోలీస్ ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులతో పాటు మరికొందరు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోండగా.. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.