మహా: హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జి+3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. హైదరాబాద్కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించగా సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇటీవల క్షేత్రస్ధాయిలో మరోసారి పరిశీలన జరుపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాలలో ఉంటున్నట్లు తేలిందన్నారు.
గిరిజనులకు 22,016 ఇండ్లు..
తొలివిడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏండ్ల తరబడి నిలువ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటీడీఏ పరిధిలోగల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని దీనితో కలిపి గిరిజనులకు ఇంతవరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఇండ్లకు తక్షణమే లబ్దిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ల ఇంటికోసం ఐదు లక్షల రూపాయిలు ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు.







