భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (మహా):
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులలో ముఖ్యమైనవి:-
పాల్వంచకు చెందిన మేడిద అనిత గత 25 సంవత్సరాల నుండి పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు కాలనీలో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని, నిరుపేదలైన తమకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వ పథకానికి మేము అర్హులం కాలేదని, తమకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పీడీ హౌసింగ్ అధికారికి ఎండార్స్ చేశారు.
భద్రాచలం రాజుపేట కాలనీకి చెందిన ఆడాది గోపి తాను బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నానని,తన కుటుంబం ఏదో ఒక పని చేస్తేనే ఇల్లు గడుస్తున్నదని, కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని, తనకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండర్స్ చేశారు.
దమ్మపేట మండలం చిల్ల గుంపు గ్రామానికి చెందిన సున్నం నాగమణి తాము కొన్ని సంవత్సరాలుగా 7 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని, పట్టాదారు పాస్ పుస్తకం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పాస్ పుస్తకం రాలేదని, తన దరఖాస్తును పరిశీలించి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఈ సెక్షన్ కి ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డు నందు మసీదు నిర్మించబడి తొమ్మిది సంవత్సరాలు అయ్యిందని, మసీదుకు వెళ్ళదారిలో ఐదు కరెంటు స్తంభాలు ఉండగా వాటికి వీధి దీపాలు లేకపోవడం వల్ల ఆ పరిధిలో గల మసీదు గుడి మరియు చర్చికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ కరెంట్ స్తంభాలకు వీధి దీపాలు అమర్చి విద్యుత్ సౌకర్యం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారి కి ఎండార్స్ చేశారు.
చర్ల మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన చింతల భాస్కరరావు, తాము ముగ్గురం అన్నదమ్ములమని తమకు పాత చర్ల మండలం దోసిన పల్లి గ్రామంలో సర్వే నంబర్ 139 3/1 లో మా నాన్నగారి పేరు మీద ఆరు ఎకరాలు ఉన్నదని దానిని మా పెద్దన్న ఒక్కడే పాస్ పుస్తకం చేయించుకొని సాగు చేసుకుంటున్నాడని మా తమ్మునికి మరియు నాకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదని, మొత్తం తనే సాగు చేసుకుంటున్నాడని, ఇకనైనా మా ముగ్గురు అన్నదమ్ములకు ఆ భూమిని సమానంగా పంచి పాస్ పుస్తకం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం పరిపాలన అధికారికి ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం వెంగళరావు కాలనీకి చెందిన అజ్మీర కీర్తన తాను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసానని అందులో తనకు మూడో విడతలో కూడా ప్రవేశం రాలేదని తన తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తారని, తన నాన్న కూడా ఆర్థికపరంగా తనను చదివించే స్తోమత లేదని తనకు గురుకులాల్లో సీటు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఆర్ సి ఓ కు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.








