Mahaa Daily Exclusive

  ఆస్పిరేషన్ జిల్లా నుండి ఇన్స్పిరేషన్ జిల్లాగా మారాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 05 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషన్ జిల్లాగా కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే ఇన్స్పిరేషన్ జిల్లాగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో ప్రతి శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రణాళిక అధికారి (సిపిఓ) సంజీవరావు అధ్యక్షత వహించగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిపిఓ సంజీవరావు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు విశేష కృషి చేస్తున్న కలెక్టర్ ను అధికారులు సన్మానించారు అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ..

– రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి….

ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌గా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం మరియు నీతి అయోగ్ సంయుక్తంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలో అనేక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని, ప్రతి ఉద్యోగి సమర్థంగా పనిచేయడంతోనే జిల్లా ఈ స్థాయికి చేరుకుందని కలెక్టర్ తెలిపారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని విభాగాల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నామని, దీని ద్వారా జిల్లా దేశవ్యాప్తంగా ఆదర్శ జిల్లాగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు తవ్వాలి అనే పిలుపుతో జిల్లాలో చేపట్టిన సామూహిక కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల నుండి ప్రారంభమై జిల్లావ్యాప్తంగా విస్తరించి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా పిల్లలలో పోషకాహార లోపం, ఎనీమియా వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మునగాకు వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా ఎనీమియా రాకుండా నియంత్రించవచ్చని వివరించారు. వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జిల్లాలో అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించి ఆహారపు అలవాట్లను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

– అంగన్వాడీల ద్వారా విద్యారంగం పటిష్ఠతకు కృషి…..
విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి స్మార్ట్ అంగన్వాడీలు, డిజిటల్ తరగతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వంటివి ఉపయోగపడుతున్నాయని, సిడిపిఓ, సూపర్వైజర్లు మరియు అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రేగళ్ల అంగన్వాడీ కేంద్రంలో గతంలో చీకటి, ఉక్క పోత వల్ల పిల్లలు రావడం తగ్గిపోయిందని, ఇప్పుడు విద్యుత్, ఫ్యాన్ వంటివి ఏర్పాటు చేయడం వల్ల పిల్లల హాజరు పెరిగిందని వివరించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రం మరియు ప్రతి పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఉన్నటువంటి సమస్యలు మరియు వాటి పరిష్కారాలను నివేదికల సమర్పించడం ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని అన్నారు. దీని ద్వారా విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి శాఖలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో సమన్వయంగా ముందుకు సాగాలని, ప్రతి కార్యక్రమాన్ని లక్ష్య ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు దేశవ్యాప్తంగా ఆదర్శ అభివృద్ధి జిల్లాగా వినిపించేలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఆకాంక్షిత అభివృద్ధి లక్ష్యాల్లో విశేష కృషి చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలత లేనినా, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి ( రిటైర్డ్) మరియు ఉద్యోగులకు, సిబ్బందికి 133 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు, మెమెంటోలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. వారి సేవలను గుర్తించి మెచ్చుకోవడం ద్వారా మరింత ఉత్సాహంతో సేవలందించేందుకు ప్రతి ఉద్యోగి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ మరియు ప్రణాళిక శాఖ తదితరులు శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.