సిర్పూర్ మహా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లూరు గ్రామానికి చెందిన కొడుప నవదీప్ (11) అనే చిన్నారి పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పాము కాటేయడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని తొలుత కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో శోకసంద్రం అలుముకుంది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులు, బంధువులను కంటతడి పెట్టించింది.స్థానికులు మాట్లాడుతూ – గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు సరైన అవగాహన, తక్షణ వైద్య సౌకర్యాలు లేకపోవడమే ఇలాంటి విషాదాలకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలను మరింత బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.








