Mahaa Daily Exclusive

  బీసీ కుల గణనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ..

Share

బీసీ కుల గణనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్‌ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయించాలని చెప్పారు.

 

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

 

మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, అంతేకాకుండా 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన రెండు నెలల గడువులోగా కమిషన్ తన రిపోర్టు సమర్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

 

2011 తర్వాత జన గణన జరగని కారణంగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలి. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలి. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

బీసీ క‌మిష‌న్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలి. 60 రోజుల్లోగా సామాజిక‌, ఆర్థిక స‌ర్వే పూర్తి చేసి డిసెంబ‌రు 9 లోపు నివేదిక స‌మ‌ర్పించాలి. ఈ స‌ర్వే పూర్త‌యితే వెంట‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు వెళ్లాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest