ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీ మద్యం పాలసీ లో భాగంగా నూతన మద్యం షాపులకు టెండర్లు పిలిచి డ్రా తీసి డ్రాలో షాపులు వచ్చిన వారికి అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలలో డిజిటల్ చెల్లింపును అమలులోకి తెచ్చింది. ఇక గతంలో టిడిపి హయాంలో ఉన్న పాత బ్రాండ్లను తగ్గింపు ధరలతో మళ్ళీ ఏపీలో అందుబాటులోకి తెచ్చింది.
మండుబాబులతో కళకళలాడిన లిక్కర్ షాపులు
ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోగా లిక్కర్ షాపులు ప్రముఖ మద్యం బ్రాండ్ లతో కళకళలాడాయి.. దాంతో, మద్యం దుకాణాల వద్ద మందుబాబులు సందడి చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్స్ కోసం మందుబాబులు లిక్కర్ షాపుల ముందు క్యూ కట్టారు.
ఏపీలో 99 రూపాయల క్వార్టర్ మద్యం
ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రైవేటుకు లిక్కర్ షాపులను అప్పగించిన సర్కార్ 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి తెస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడంతో మందుబాబుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అయింది. ఇక ఈ 99 రూపాయల క్వార్టర్ మద్యం అందుబాటులో ఉన్నచోట నాసిరకంగా ఉందన్న టాక్ కూడా వినిపించింది.
మందు బాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
అయితే 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్స్ అందుబాటులోకి రాకపోవడంతో చాలామంది 130 రూపాయలు క్వార్టర్ మద్యం బాటిల్ కోసం ఖర్చుపెట్టి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అసహన వ్యక్తం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో తాజాగా మందు బాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్ అందనుందని పేర్కొంది.
నాలుగు కంపెనీల ఏడు బ్రాండ్లకు అనుమతి
99 రూపాయలకే క్వార్టర్ మద్యం ఉత్పత్తి పెంచనున్నట్టు వెల్లడించింది. ఈ నెలాఖరు నాటికి 99 రూపాయల క్వార్టర్ మద్యం బాటిల్స్ 2.4 లక్షల మద్యం బాటిల్స్ అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. నాలుగు కంపెనీలు ఏడు రకాల మద్యం బ్రాండ్లను క్వార్టర్ 99 రూపాయలకే ఇవ్వడానికి అనుమతులు పొందినట్టు తెలిపింది. దీంతో భవిష్యత్ లో 99 రూపాయల లిక్కర్ కు ఇబ్బంది ఉండదని పేర్కొంది. మొత్తంగా ఎక్సైజ్ శాఖ ఏపీలో మందు బాబులను సంతృప్తి పరిచేందుకు రకరకాల నిర్ణయాలను తీసుకొని లిక్కర్ ప్రియులకు సదా మీ సేవలో అంటూ శుభవార్త చెప్పింది.








