- ఈసారికి ఇలా కానిద్దాం
- వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే
- నీట్ ఎగ్జామ్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- అవకతవకలను సహించమని హెచ్చరిక
న్యూఢిల్లీ, మహా : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో కాకుండా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్ కోసం విద్యార్థులు తమ సౌలభ్యం ప్రకారం సిటీని ఎంచుకోవడానికి ఒక వారం సమయం లభిస్తుందని,అడ్మిట్ కార్డులు జూన్ 14 న విడుదల చేస్తామని వెల్లడించారు.
నీట్ పేపర్ లీక్ పై
నీట్ పేపర్ లీకులపై కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించారు. ‘విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎన్టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న నిర్వహించింది. మే 7న ఎన్టీఏకు ఒక అభ్యంతరం వ్యక్తమైంది. గెస్ పేపర్లోని కొన్ని ప్రశ్నలు ఈ ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ పేపర్లో వచ్చాయని తెలిసింది. వెంటనే దీనిపై ఎన్ టీఏ, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాయి. ఈసారి పేపర్ లీక్ అయిందని మా దృష్టికి రాగానే, ఎడ్యుకేషన్ మాఫియా కుట్రల వల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకూడదని భావించాం. అందుకే, నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు మే 12న ప్రకటించాం’ అని తెలిపారు.
ఎలాంటి అవకతవకలను సహించేది లేదు
‘రద్దు చేసిన ఎగ్జామ్ వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జూ్ 21న రీఎగ్జామ్ నిర్వహించనున్నామని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకునేందుకుగానూ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. అన్ని శాఖలు దీనిని తీవ్రంగా పరిగణించి రంగంలోకి దిగాయి. ఎలాంటి అవకతవకలను సహించేది లేదని’ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
22 లక్షల మంది అభ్యర్థులు..
నీట్ యూజీ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. భారత్లోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లోని మొత్తం 5,432 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఆన్సర్ కీ విడుదలైన తర్వాత చేతితో రాసిన ఒక గెస్ పేపర్ను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ గెస్ పేపర్లోని ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా, ఏకంగా 120 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ మరియు 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు.







