Mahaa Daily Exclusive

  హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం….

Share

  • హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం
  • కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు
  • కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత శర్మ

న్యూఢిల్లీ, మహా : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి జస్టిస్ స్వర్ణకాంత శర్మను ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ముగ్గురికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసుపై జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అనంతరం ముగ్గురికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

మద్యం పాలసీ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, వారి మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు పెట్టారు. ఓ విద్యాసంస్థలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి, ఆమె ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా తప్పుగా ప్రచారం చేశారు. ఆమె ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారంపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై గురువారం స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.