Mahaa Daily Exclusive

  మూసీపై రేవంత్ సర్కార్ ఫోకస్..!

Share

దీపావళి పండుగ పూర్తి కావడంతో మూసీపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఈ ప్రాజెక్టును వేగంగా తెరపైకి తీసుకెళ్లేందుకు చకచకా అడుగులు వేస్తోంది. తొలి దశ పనులు చేపట్టాలనే ఆలోచన చేస్తోంది. దీని వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.

 

మూసీ పునరుజ్జీవనపై విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేశాయి.. చేస్తున్నాయి. చివరకు మెత్తబడినట్టు కనిపిస్తోంది. మొదట్లో మొండి కేసిన విపక్ష పార్టీలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చూసి సాధ్యమేనన్నది కొందరి నేతల్లో మొదలైంది.

 

మూసీ పునరుజ్జీవనకు తాము అడ్డంకి కాదని, అక్కడి ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఓ వైపు అధికారులతో వరసగా సమీక్షలు చేస్తున్నారు సీఎం రేవంత్. గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

 

రెండు వారాల్లో టెండర్లను పిలవనుంది తెలంగాణ ప్రభుత్వం. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు పనులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్‌ను సుందరీకణపై దృష్టి పెట్టింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తోంది.

 

బాపుఘాట్‌ దగ్గర ఎస్టీపీలతో నీటి శుద్ధి కోసం టెండర్లకు సిద్ధమవుతోంది. మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం వల్ల నది ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వం ప్లాన్. శుద్ది చేసిన నీరు నదిలో కలుస్తుండడంతో కాలుష్యం తగ్గనుంది.

 

ఇందుకోసం ఈ వారంలో దీని కోసం టెండర్లు పిలవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తానికి ఫస్ట్ ఫేజ్‌ను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది.