Mahaa Daily Exclusive

  టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు…

Share

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.
* మహిళా నేతలకు దక్కని అవకాశం.
అమరావతి, మహా.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్డీయే కూటమికి దక్కిన అవకాశాల్లో.. టీడీపీ కోటాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానాల కోసం సానా సతీష్, చింతకాయల విజయ్, అలాగే భాష్యం రామకృష్ణల పేర్లను ఆయన ఖరారు చేశారు. కూటమి ఉమ్మడి అభ్యర్థుల ఎంపికలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాల్లో.. మిత్రపక్షమైన జనసేనకు ఒక సీటును కేటాయించగా, మిగిలిన మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను టీడీపీ బరిలోకి దింపింది.
అయితే, ఈ తాజా జాబితాలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నప్పటికీ.. దాన్ని తాము చేతల్లో అమలు చేసి చూపిస్తామని టీడీపీ అధినాయకత్వం ఇన్నాళ్లూ బలంగా చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజ్యసభ సీట్ల కేటాయింపులో సైతం కనీసం ఒక స్థానాన్ని మహిళలకు ఇవ్వడం ద్వారా.. తమకు దక్కిన మూడు సీట్లలో 33 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేసినట్లు అవుతుందని పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. తీరా జాబితా వెలువడే సరికి ఆ హామీ ఆచరణ నోచుకోలేదు.
పెద్దల సభకు వెళ్లే ముగ్గురు అభ్యర్థులలో ఏ ఒక్కరికీ మహిళా కోటా కింద అవకాశం దక్కకపోవడంతో మహిళా నేతలకు మొండి చేయి ఎదురైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలకు పెద్ద పీట వేస్తామని పదేపదే చెప్పిన పార్టీ.. తీరా కీలక పదవుల ఎంపికలో మాత్రం ఆచరణాత్మకంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధనపై ముందు వరుసలో నిలబడతామని చెప్పిన తెలుగుదేశం పార్టీ.. తాజా నిర్ణయంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మాట తప్పిందనే అపవాదును మూటగట్టుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.