Mahaa Daily Exclusive

  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల డెడ్‌లైన్…

Share

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల డెడ్‌లైన్.
* తప్పుకోకపోతే ఉద్యమమే!
* జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.
* తేల్చిచెప్పిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.
ఢిల్లీ, మహా.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కేవలం ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టమైన అల్టిమేటం ఇచ్చారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థుల పట్ల మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ సంచలన ప్రకటన విడుదల చేశారు.
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము చేపట్టిన శాంతియుత మహా నిరసన ఒక చారిత్రక ఘట్టమని అభిజీత్ దీప్కే అభివర్ణించారు. ‘బొద్దింకలు’ (కాక్రోచ్‌లు) అన్నీ ఏకమైతే వ్యవస్థను ఎలా కదిలించగలవో ప్రభుత్వానికి రుచి చూపించిన చిన్న ట్రైలర్ మాత్రమే నిన్నటి ఆందోళన అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు మొదటిసారిగా రోడ్డెక్కిన వారేనని, విద్యావ్యవస్థపై వారిలో గూడుకట్టుకున్న తీవ్రమైన కోపానికి, నిరాశకు ఈ ఆందోళన అద్దం పడుతోందని ఆయన విశ్లేషించారు. తమ భవిష్యత్తు కోసం గళమెత్తేందుకు వారంతా ఎంతో ధైర్యంగా ముందుకు రావడం వ్యవస్థలో మార్పునకు సంకేతమన్నారు.
మండే ఎండలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ఉద్యమంలో భాగస్వాములైన యువత, విద్యార్థులు, ఇతర మద్దతుదారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతియుత నిరసనే తమ అతిపెద్ద బలమని, ఐకమత్యంతో సాగే ఇలాంటి అహింసాత్మక ఉద్యమాన్ని ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదని ఆయన తేల్చిచెప్పారు. న్యాయం కోసం పోరాడే క్రమంలో ఎవరికీ, ఎక్కడా భయపడాల్సిన అవసరమే లేదని ఉద్యమకారుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన చర్యలతో ఒక తరాన్ని తీవ్ర అన్యాయానికి గురిచేశారని అభిజీత్ ఆరోపించారు. ఈ వ్యవహారం కేవలం ఒక్క రోజు నిరసనతోనే సమసిపోదని, తమ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమ స్వరూపం, తదుపరి కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఆయన నేడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వేదికగా తన అనుచరులు, మద్దతుదారులతో ముఖాముఖి మాట్లాడనున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలతో కేంద్ర మంత్రి రాజీనామా వ్యవహారంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.