Mahaa Daily Exclusive

  అనుమానాస్పద విదేశీయుల’పై ఈసీ నజర్!..

Share

అనుమానాస్పద విదేశీయుల’పై ఈసీ నజర్!
* ఎస్ఐఆర్ సమయంలో వివరాలు సేకరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు.
* నివాసాల్లో బీఎల్ఓల ప్రత్యక్ష విచారణ.
ఢిల్లీ, మహా.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో విదేశీయులుగా అనుమానం ఉన్న వారి వివరాలు లభిస్తే, ఆయా కేసులను తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తన రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ స్పష్టంగా ఆదేశించింది. అదేవిధంగా, ఏ ఓటరు నుంచి అయినా ఓటరు నమోదు ఫారమ్‌లు తిరిగి రానట్లయితే.. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) సదరు ఓటరు పొరుగున నివసించే వారిని క్షుణ్ణంగా విచారించాలని సూచించింది. ఆ ఓటరు ప్రసుతం అక్కడే నివసిస్తున్నారా? లేక వేరే ప్రాంతానికి వలస వెళ్లారా? మరణించారా? లేదా ఒకే పేరు రెండుసార్లు నమోదై ఉందా? వంటి కీలక వివరాలను సేకరించి జాబితాలో నమోదు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

*మార్గదర్శకాలు జారీ.. పెరిగిన అధికారుల బాధ్యత*

ఈ ఎస్ఐఆర్ నిర్వహణలో అనుసరించాల్సిన కఠిన విధివిధానాలపై మే 14న అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణాత్మకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) అనుమానిత విదేశీ పౌరుల కేసులను పౌరసత్వ చట్టం-1955 కింద నియమించబడిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించింది. ఈ కీలక ప్రక్రియలో అసిస్టెంట్ ఈఆర్ఓలు కూడా ఈఆర్ఓలతో సమానమైన అధికారాలను కలిగి ఉంటారని ఈసీ స్పష్టం చేసింది.
*గతంలో రేగిన రాజకీయ రచ్చ*
గతేడాది బిహార్‌లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన విదేశీ పౌరులను తమ క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, దానికి సంబంధించిన ఖచ్చితమైన సంఖ్యను కానీ, ఆధారాలను కానీ ఎన్నికల యంత్రాంగం బయటపెట్టలేదు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరియు దాని మిత్రపక్షాలకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి కుట్రపూరితంగా తొలగించడానికే ఎన్నికల సంఘం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి.
*దేశవ్యాప్తంగా మూడో విడత ప్రారంభం*
రాజకీయ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, మే 30వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మూడో విడత ఎస్ఐఆర్ ప్రక్రియను విడతలవారీగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బృహత్తర ప్రక్రియ దిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపుర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపురతో పాటు దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్‌లలో కొనసాగుతోంది. కాగా, ప్రస్తుతం ఈ విచారణ జరుగుతున్న రాష్ట్రాల్లో పంజాబ్, ఝార్ఖండ్, కర్ణాకట, తెలంగాణ వంటి రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉండటం గమనార్హం.
*లక్షలాది సిబ్బందితో భారీ క్రతువు*
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక అత్యంత భారీ ప్రక్రియగా నిలుస్తోంది. ఈ తాజా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 3.94 లక్షల కంటే ఎక్కువ మంది బీఎల్ఓలు స్వయంగా రంగంలోకి దిగి, సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లను నేరుగా సందర్శిస్తున్నారు. ఓటర్ల కచ్చితమైన నమోదు దశలో వీరికి సహాయం చేయడానికి వివిధ రాజకీయ పార్టీల తరఫున నియమితులైన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) కూడా భాగస్వాములు అవుతున్నారు.
వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లలో ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను తదుపరి తేదీల్లో ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అటు అసోంలో మాత్రం ప్రత్యేక సవరణ (స్పెషల్ రివిజన్) చేపట్టారు.
*రెండో విడతలో 5.18 కోట్ల ఓట్ల తొలగింపు!*
ఇంతకుముందు ముగిసిన ఎస్ఐఆర్ రెండో విడతలో ఓటర్ల జాబితా ప్రక్షాళన భారీ స్థాయిలో జరిగింది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ఉమ్మడి ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 10.2 శాతం ఓట్లను అధికారులు తొలగించారు. ఇందులో కేవలం మరణించిన వారే 60 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది. వాస్తవానికి గతేడాది అక్టోబర్ 27న ఈసీ రెండో విడత ఎస్ఐఆర్ ప్రకటించిన సమయానికి ఈ 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 50.99 కోట్లుగా నమోదై ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన పూర్తయిన తర్వాత ఆ సంఖ్య 45.81 కోట్లకు పడిపోయింది. అంటే నిబంధనల ప్రకారం అర్హత లేని సుమారు 5.18 కోట్ల కంటే ఎక్కువ మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది.
అయితే, వివిధ రకాల సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ ఎస్ఐఆర్ షెడ్యూల్‌లో తరచూ మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతంలో బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం బెంగాల్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ విధానానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు స్వయంగా హాజరై వాదనలు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.