- రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు
- నేటి నుంచి కీలకాంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు
- 10 అంశాలపై రిపోర్టులు సిద్దం
- 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, మహా : ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలన్నారు. 7 శ్వేత పత్రాలతో పాటు… మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రొగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది… రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది… వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్కు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమన్నారు. నాటి 7 శ్వేత అంశాలతో సహా ఈసారి కొత్తగా డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలపైనా రిపోర్టులు విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో ‘డెవలప్మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్… ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో ‘గుడ్ గవర్నెన్స్’ ప్రోగెస్ రిపోర్ట్… సంక్షేమం, పీ4 వంటి వాటితో ‘వెల్ఫేర్ – ఎంపవర్మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈసారి విడుదల చేయనున్నారు. వీటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్… ఈ 4 అంశాలకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లు మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత… మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత… అన్నీ కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్పారు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో ముందుగా సోమవారం విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.







