Mahaa Daily Exclusive

  సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసుల షాక్-లుక్ అవుట్ నోటీస్ జారీ..!

Share

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో గతంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత సహా ఇతర నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టించిన వ్యవహారంలో పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు మరికొందరిని అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ మరికొందరికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

 

వైసీపీ సోషల్ మీడియా పోస్టులకు బాధ్యుడైన పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో విదేశాలకు పారిపోకుండా సజ్జల కుమారుడిపై కడప పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసారు.

 

సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలకమైన అర్జున్ రెడ్డి, మరికొందరిపైనా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీరి కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేస్తున్న పోలీసులు..వీరికి బెయిల్ కూడా రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.