Mahaa Daily Exclusive

  పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్..

Share

  • పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్
  • విదేశాంగ శాఖ ప్రకటనపై మండిపడ్డ ఎంపీ అసదుద్దీన్
  • బీజేపీ సభ్యత్వం ఉంటేనే భారత పౌరసత్వం అంటారా

హైదరాబాద్, మహా : పాస్ పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే.. పౌరసత్వానికి గుర్తింపు కాదన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖప్రకటనపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పాస్ పోర్టును పౌరసత్వానికి గుర్తింపు కాదన్నారు రేపు బీజేపీ సభ్యత్వం ఉన్నవాళ్లకే భారత పౌరసత్వం అని అంటారు.. త్వరలో జరగబోయేది ఇదే అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగాపాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ కాదు, ఆధార్ కార్డు కాదు ఇలా అన్నింటికీ ఏదో ఒక కారణం చెప్పి పని చేయదంటే భారత పౌరులమని గుర్తింపు కోసం ఏం చూపించాలని కేంద్రాన్ని నిలదీశారు. తాను చేసిందే చట్టం, చెప్పిందే వేదం అన్నట్లుగా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని, ఇది దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఎంఐఎం పోరాడుతుందని, భారత పౌరులని నిరూపించుకునేందుకు ఏ డాక్యుమెంట్ చూపించాలో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

14వ పాస్‌పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్ పోర్టు, పౌరసత్వం గుర్తింపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. పాస్ పోర్టు కేవలం ట్రావెలింగ్ డాక్యుమెంట్ మాత్రమే.. పౌరసత్వానికి అది గుర్తింపు కాదు అని ప్రకటించింది. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం భారత పౌరుడు కాని వ్యక్తికీ పాస్‌పోర్ట్ లేదా ప్రత్యేక ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు. ఈ నిబంధనే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి సంపూర్ణ, తుది గుర్తింపుగా పరిగణించలేమని సూచిస్తోందని క్లారిటీ ఇచ్చింది. దీంతో దేశ పౌరులలో గందరగోళం, ఆందోళన రేకెత్తించింది.