ఖైరతాబాద్, మహా : ఖైరతాబాద్ నియోజకవర్గ వెంకటేశ్వర డివిజన్ శ్రీ నికేతన్ కాలనీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం బిఎల్ఓ షేక్ అక్రమ్, బిఎల్ఏ సుధీర్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాలనీలోని ఓటరు జాబితాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు కావడం, మరణించిన వారి పేర్లు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను తొలగించి జాబితాను సరిచేయడం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా అనేది ఎన్నికల ప్రక్రియకు పునాది అని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ వెంకట కోటిరెడ్డి, దామోదర్ నాయుడు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.








