- డ్రోన్లకు నో ఎంట్రీ.
- పుణెలో ఆగస్టు 22న కార్యక్రమం.
- 8–10 వేల మంది హాజరయ్యే అవకాశం.
- శాంతిభద్రతలపై నిర్వాహకులదే బాధ్యత.
పుణె,మహా.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 22న పుణెలో నిర్వహించనున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి పోలీసులు 30 షరతులతో అనుమతి ఇచ్చారు. విద్య, భద్రత, సమానత్వం, పోటీ పరీక్షలు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులతో చర్చించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఎస్ఎస్పీఎంఎస్ కళాశాల మైదానంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు జరగనుంది. సుమారు 8 వేల నుంచి 10 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కార్యక్రమంలో అభ్యంతరకరమైన బ్యానర్లు, చిత్రాలు ప్రదర్శించరాదని పోలీసులు స్పష్టం చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు ఉండకూడదని ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అందుకు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అనుమతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేదిక చుట్టూ కట్టుదిట్టమైన భద్రత
ప్రధాన వేదిక ముందు ‘డి-కార్డన్’ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, అగ్నిమాపక భద్రత వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.
మహిళా భద్రతా సిబ్బందితో పాటు తగిన సంఖ్యలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణలో మహిళా వాలంటీర్లను కూడా పెద్ద సంఖ్యలో వినియోగించాలని పోలీసులు పేర్కొన్నారు. వేదికతో పాటు కార్యక్రమ ప్రాంగణం మొత్తాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
డ్రోన్లు, బీమ్ లైట్లపై నిషేధం
కార్యక్రమ ప్రాంగణంలో ఫొటోగ్రఫీ లేదా ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఆకాశంలోకి ప్రసరించే అధిక తీవ్రత కలిగిన బీమ్ లైట్లపైనా ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఐఎస్ఎఫ్ నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, వైద్య, అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా ప్రత్యేక మార్గాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమానికి ముందు అగ్నిమాపక, ట్రాఫిక్ విభాగాల నుంచి అవసరమైన నిరభ్యంతర ధ్రువపత్రాలు (ఎన్ఓసీలు) తీసుకోవాలని స్పష్టం చేశారు.
శబ్ద కాలుష్యానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, శబ్ద కాలుష్య (నియంత్రణ) నిబంధనలు–2000, పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 నిబంధనలను పాటించాలని పోలీసులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరిగినా అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం తమకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఆగస్టు 31 వరకు పుణెలో ఆంక్షలు
పండుగలు, వివిధ కార్యక్రమాల నేపథ్యంలో పుణె నగరంలో మంగళవారం నుంచి ఆగస్టు 31 వరకు 14 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. బహిరంగ సభలు, దిష్టిబొమ్మల దహనం తదితర కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, పండుగల భద్రత పేరుతో విధించిన ఆంక్షలు రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నవేనని ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలు, భద్రతా ప్రమాణాల దృష్ట్యానే నిబంధనలు విధించినట్లు చెబుతున్నారు.
‘నియంత్రిత కార్యక్రమం’ అంటూ ఫడణవీస్ విమర్శలు
రాహుల్ గాంధీ కార్యక్రమంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా విమర్శలు గుప్పించారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ అన్ని వర్గాల విద్యార్థులతో బహిరంగంగా చర్చించే అవకాశం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక నిర్దిష్ట భావజాలానికి చెందిన విద్యార్థులకే అవకాశం కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
యువతతో రాజకీయ నాయకులు మమేకం కావడాన్ని తాను స్వాగతిస్తానని, అయితే విద్యార్థి సమాజంలోని అన్ని వర్గాలతో పారదర్శకంగా సంభాషించినప్పుడే అలాంటి కార్యక్రమానికి నిజమైన అర్థం ఉంటుందని ఫడణవీస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న పార్టీ నిర్ణయంపైనా ఆయన విమర్శలు చేశారు.







