Mahaa Daily Exclusive

  నీట్‌ ఆందోళనలపై సుప్రీం కీలక నిర్ణయం..! మాజీ న్యాయమూర్తి ఆర్‌. సుభాష్‌రెడ్డి నేతృత్వంలో విచారణ..

Share

• పోలీసుల బలప్రయోగంపై ఐదుగురు సభ్యుల అత్యున్నత స్థాయి కమిటీ.
• మాజీ న్యాయమూర్తి ఆర్‌. సుభాష్‌రెడ్డి నేతృత్వంలో విచారణ.

ఢిల్లీ, మహా.
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పోలీసుల చర్యలతో పాటు నిరసనకారుల నుంచి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ధ్వంసం తదితర అంశాలపైనా కమిటీ విచారణ చేపట్టనుంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి కమిటీకి అధ్యక్షత వహించనున్నారు. పంజాబ్‌–హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.కె. ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శలిందర్‌ కౌర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌.కె. శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్‌.ఆర్‌. బిష్ణోయ్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

బలప్రయోగంపై సమగ్ర విచారణ

నిరసనకారులపై పోలీసులు పెల్లెట్‌ గన్స్‌, విద్యుత్‌ లాఠీలు, బాష్పవాయువు, లాఠీఛార్జి వంటి చర్యలు చేపట్టారన్న ఆరోపణలను కమిటీ పరిశీలించనుంది. ముఖ్యంగా మహిళా నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు, నిఘా చర్యలు, ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు అవసరానికి మించి బలప్రయోగం చేశాయా? అనే అంశాలను పరిశీలించనుంది.

అదే సమయంలో నిరసనకారుల నుంచి పోలీసులపై దాడులు జరిగాయా? ఆందోళనల సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయా? ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందా? అనే అంశాలపైనా కమిటీ దృష్టి సారించనుంది. అంటే ఒకవైపు పోలీసుల చర్యలను, మరోవైపు నిరసనకారుల ప్రవర్తనను సమగ్రంగా అంచనా వేయనుంది.

‘బలప్రయోగంలో నిబంధనలు ఉల్లంఘించారా?’

పోలీసులు, భద్రతా సిబ్బంది చర్యల వల్ల నిరసనకారులకు తీవ్రమైన గాయాలు లేదా హాని కలిగిందన్న ఆరోపణలను కమిటీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బలప్రయోగానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అందుకు బాధ్యులెవరు? బలాన్ని ప్రయోగించే సమయంలో చట్టాలు, నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలు ఉల్లంఘించారా? వంటి అంశాలను కూడా విచారణలో భాగంగా పరిశీలించాలని సూచించింది.

కమిటీ విచారణను ఒక్కసారితో ముగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిస్థితులను నిరంతరం, క్రమబద్ధంగా సమీక్షించాలని ఆదేశించింది. విచారణ పురోగతిపై మధ్యంతర నివేదికలను ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు సమర్పించాలని కమిటీకి సూచించింది.

జూలై 20న ఉద్రిక్తత

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలు, పరీక్షా విధానంలో సంస్కరణలు, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్లతో కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. జూలై 20న దిల్లీలో పార్లమెంటు వైపు చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.

పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసుల చర్యలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో మితిమీరిన బలప్రయోగంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Latest