Mahaa Daily Exclusive

  పీపీపీ మోడ్ లో నడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Share

కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని విమర్శించారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. మైక్ పట్టగానే కేసీఆర్‌ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రేవంత్ రెడ్డికి రాదని విమర్శించారు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారని ధ్వజమెత్తారు. సోమవారం మహబూబాబాద్‌లో పర్యటించిన కవిత మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పదిశాతం సర్కార్ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పర్సెంటేజీ ఇస్తే పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదని మండిపడ్డారు. మహిళలకు రూ,. 2500 ఇవ్వలేదు కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయవద్దని చెప్పారు. బస్సుల సంఖ్య పెంచాలని అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేవలం రాజకీయం తప్పా పరిపాలనపై రేవంత్ సర్కారుకు దృష్టి లేదని చెప్పారు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్దతు ధర కోసం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ మాత్రం సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేని ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని ఆగ్రహించారు. ప్రజలకు ఏం చేశారని ప్రచారం చేయడానికి వెళ్లారని నిలదీశారు. రైతు రుణమాఫీ ఎవరికీ పూర్తిగా కాలేదని చెప్పారు. రైతు భరోసా గ్రామాల్లో చాలా మందికి రాలేదని చెప్పుకొచ్చారు. రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కవిత విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. క్వింటా మిర్చికి రూ .25 వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు చేస్తామన్న సాయాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. వరదలొచ్చినా, కన్నీళ్లిచ్చినా, కష్టాలొచ్చినా అండగా ఉండేది గులాబీ జెండానే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు.