Mahaa Daily Exclusive

  ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి చేరికకు సుగమమైన మార్గం …!

Share

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే సేవలందిస్తున్న నాగబాబు త్వరలో ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోక్ సభ సీటు అంటూ ఒకసారి.. ఎమ్మెల్సీ సీటు అంటూ మరోసారి కార్పొరేషన్ పదవి అంటూ రోజూ వివిధ రకాలుగా వార్తలు వినిపించాయి. తాజాగా త్వరలో ఎపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎప్పటి నుంచో నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని జనసేన శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నా అది ఆలస్యం అయ్యింది. 2019 ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అప్పటి నుంచి లోక్‌సభ, కార్పొరేషన్, మంత్రివర్గం వంటి పలు ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఇప్పుడు ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అధికారికంగా స్పష్టత వచ్చింది.

త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కినట్లు ఖరారు కావడంతో జనసేన వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. జనసేన తరఫున పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి.. నామినేషన్‌కు అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఎంతో ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవి లభించే అవకాశం ఉందని.. నాగబాబు కూడా మంత్రి పదవికి దారితీసే మార్గంలో ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఒక సందర్భంలో నాగ బాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.