Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హీందీ తొలగించాలి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్…!

Share

దేశవ్యాప్తంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రోజుకో మాటతో తమిళనాడు సీఎం బీజేపీ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా బీజేపీ నేతలు చెబుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగానే తమిళ భాషపై ప్రేమ ఉంటే.. దాన్ని మాటల్లో చెప్పడానికి బదులుగా చేతల్లో చూపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీ భాషను తొలగించాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ హిందీ, ఇంగ్లీషుతో పాటు ఓ స్థానిక భాషను కూడా నేర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పగా.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. తాము ఈ త్రిభాషా విధానాన్ని అస్సలే అమలు చేయమంటూనే హిందీ నేర్చుకోమని బలంవంతం చేయొద్దని కోరుతోంది. మరోవైపు బీజేపీ సర్కారు పిల్లలు అన్ని భాషలు నేర్చుకుంటే మంచిదని కాబట్టి కచ్చితంగా హిందీ నేర్చుకోవాలని వివరిస్తోంది.

ఈక్రమంలోనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. హిందీ భాష 25 ప్రాంతీయ భాషలను మింగేసిందని ఇటీవలే చెప్పిన ఆయన రెండ్రోజుల క్రితమే ఉత్తరాధిలో మూడో భాష ఏందంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా బీజేపీ సర్కారుకు ప్రశ్నలు సంధించారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిజంగానే తమిళ భాషపై అంత ప్రేమ ఉంటే.. దాన్ని ఆయన చేతల్లో చూపించాలని వివరించారు. పార్లమెంట్‌లో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందని సూచించారు. అంతేకాకుండా హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా గుర్తించి.. మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. అంతటితో ఆగకుండా కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదని రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలని కోరారు.

రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లు పెట్టడం ఆపాలని.. దానికి బదులుగా తమిళ పేర్లు పెట్టమని చెప్పారు. తమిళ భాషపై ప్రేమను మాటల్లో చూపించడం కంటే కూడా ఇలా తాను చెప్పినట్లుగా చేసి చేతల్లో చూపిస్తే చాలా బాగుంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్స్ వేదికగా చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.