బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ మనుస్తాబైంది. సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 13వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. 14వ తేదీన హోలీ సందర్బంగా హాలీడే ఉంటుంది. 15వ తేదీన ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఇక 16వ తేదీన ఆదివారం సెలవు, 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ జరుపుతారు. 19న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడతారు. 20వ తేదీన సెలవు, 21వ తేదీ నుంచి బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 27వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా సమీక్ష అధికారుతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్లో సరైన సమాచారం అందించడానికి సంబంధిత కార్యదర్శులు హాజరు కావాలని అన్నారు.
సభకు హాజరు కానున్న కేసీఆర్
ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే ఆయన గవర్నర్ ప్రసంగం రోజే సభకు హాజరవుతారా, లేక సభ జరిగినన్ని రోజులు సభకు వస్తారా అన్న విషయంపై స్పష్టత కొరవడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపికైన కేసీఆర్ సభకు తరచూ హాజరు కావడం లేదు. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా కేసీఆర్ గైర్హాజరుపై అనేక రకాల విమర్శలు చేస్తోంది. తాజాగా గజ్వేల్ లోని తన పాం హౌజ్ లో జరిగిన కీలక నేతల భేటీలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై స్పష్టత ఇచ్చారు.








