హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిధుల గోల్మాల్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసోసియేషన్ నిధుల గోల్మాల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హెచ్సీఏకి చెందిన రూ. 51 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హెచ్సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. అలాగే అనుమతులు లేకుండా పరికరాలను సైతం కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అదే విధంగా క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలతోపాటు బకెట్, కుర్చీల కొనుగోలులో సైతం నిధుల దుర్వినియోగం అయినట్లు ఈడీ గుర్తించింది. ఇక కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఆ క్రమంలో హెచ్సిఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్పై ఈడీ అభియోగం నమోదు చేసింది. అందులోభాగంగా క్రికెట్ బాల్స్, బకెట్, చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆయా కాంట్రాక్టుల అప్పగించడంతో సురేందర్ అగర్వాల్కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు రూ. 90 లక్షల మేర నగదు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇక సురేంద్ర అగర్వాల్తోపాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలలో రూ. 90 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు ఈడీ ఉన్నతాధికారులు గుర్తించారు. అంటే హెచ్సీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ అగర్వాల్ భార్య, కుమారుడు, కోడలు అకౌంట్లకు ఈ నగదు బదిలీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించారు. అలాగే సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ నగదు చెల్లించినట్లు రుజువైంది. దీంతో రూ. 90 లక్షలలో రూ. 51.29 లక్షల ఆస్తులను ఈడీ బుధవారం అటాచ్ చేసింది. కేసు దర్యాప్తును సాగిస్తోంది.








