తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆలయ నిర్మాణానికి సహకరించాలని లేఖలో బండి విజ్ఞప్తి చేశారు. 2023 లోనే కరీంనగర్ పట్టణంలో టీటీడీ ఆలయానికి అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2023 మే 31న కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో భూమి పూజ కూడా జరిగిందన్నారు. రెండేళ్ల నుంచి ఆలయ నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆలయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపించాలని బండి సంజయ్ రిక్వెస్ట్ చేశారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు హిందూ సంప్రదాయాలను ప్రోత్సహించటంతో పాటు భక్తులకు సౌకర్యాలను అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మిస్తున్నారు. అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించగా రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ ఆలయం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ మరియు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది.
జమ్మూ నగరంలోని సిధ్రా ప్రాంతంలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్ల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయం నిర్మించారు. ఇది జమ్మూ ప్రాంతంలో అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా నిలిచింది, 2023 జూన్ 8న ఈ ఆలయం ప్రారంభించబడింది. చెన్నైలోని టి.నగర్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. ఈ ఆలయం 2023 మార్చి 17న మహాకుంభాభిషేకంతో ప్రారంభించబడింది. 2023 మే 31న కరీంనగర్లోని పద్మానగర్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే, అప్పటి నుండి నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేయాలని కోరారు.








