అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచం చాలా ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్కు ఉపశమనం లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 8-9 తేదీల్లో జరగనున్న ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు అహ్మదాబాద్కి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు జరగనున్న కాంగ్రెస్ కీలక సమావేశాల్లో దేశంలోని తాజా పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులు ట్రంప్ విధించిన టారిఫ్లపై ప్రశ్నించగా.. ‘‘ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు అన్ని దేశాలకూ ప్రతికూల వార్తే. ట్రంప్ టారిఫ్ల వెనుక లాజిక్ ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ ప్రభావం అన్ని దేశాలపైనా ఉంది. భారత్ కూడా వీటిని భరించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ట్రంప్ ఏప్రిల్ 2న టారిఫ్లు ప్రకటించగా.. ఈ ఐదు రోజుల్లో ప్రపంచం చాలా ఇబ్బందికి గురైంది’’ అని వ్యాఖ్యానించారు.








