తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం’ అనే 3డీ మంత్రాన్ని అమలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ బౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందని తెలిపారు. హెచ్ సియు లోని 400 ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఆధారంగానే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల స్కామ్కు ప్రయత్నిస్తోంది. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో చర్చలు జరిపారు. ఎఫ్ ఆర్ బిఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని.. ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని చెప్పింది. ఇందుకోసం ఏకంగా ఆర్బీఐ నిబంధనలు, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారు. రేవంత్.. తనకు అండగా ఉన్న బీజేపీ ఎంపీకి లబ్ధి చేకూరుస్తున్నారు. స్కామ్కు సహకరించిన ఎంపీ పేరును వచ్చే ఎపిసోడ్లో చెబుతా. అన్ని ఆధారాలతో దీనిపై కేంద్రానికి లేఖ రాస్తా. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి తెలియకుండా ఇది జరిగిందని అనుకుంటున్నాను. రేవంత్ కేవల 400 ఎకరాలు మాత్రమే కాదు. రూ.60 వేల కోట్ల విలువైన హెచ్ఎండిఏ భూముల ద్వారా కూడా దోపిడి చేసేందుకు ప్లాన్ వేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణకు ఆదేశించాలని” కేటీఆర్ డిమాండ్ చేశారు.








