( హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రంలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పాలకుల తప్పుడు విధానాల కారణంగా పదేళ్ళ క్రితం బోధన్ (నిజామాబాద్ జిల్లా), ముత్యంపేట(జగిత్యాల జిల్లా), ముంభోజిపల్లి (మెదక్ జిల్లా) లలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసిన కారణంగా చెరుకు రైతులతో పాటు షుగర్ ఫ్యాక్టరీలపై ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. మూసివేసిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలను రైతులు చేపట్టినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ మేరకు సిఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్ గా, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ కో-చైర్మన్ గా, సభ్యులుగా మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి, శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు,మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ లను సభ్యులుగా నియమిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ సిఫార్సుల కమిటీని నియమించిందనీ, ఈమేరకు కమిటీ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను సందర్శించగా చెరుకు రైతులు, కార్మికుల నుంచి అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందనీ పేర్కొన్నారు. ఈమేరకు షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ సిఫార్సుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు బడ్జెట్ లో రూ. 175 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో చెరుకు రైతుల్లో ఆనందోత్సహాలను కలిగించిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసే రైతులకు గిట్టుబాటు కావడంతో పాటు రవాణా భారం తగ్గి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని ఇచ్చిన వాగ్దానం మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి చేశారు .








