Mahaa Daily Exclusive

  రేవంత్, భట్టికి విభేదాలు! మంత్రి మండలి రెండుగా చీలింది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..!

Share

మహా: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న సూత్రధారి, కుట్రదారుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటించినా కూడా డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం, భట్టికి విభేదాలు ఉన్నాయన్నారు. ఉద్యోగుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వర్గంలో విబేధాలు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రికి మంత్రులు మద్దతుగా లేరన్నారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని పెట్టి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలు ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్‌మెంట్‌ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారని, మంత్రి మండలి రెండుగా చీలిందంటూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి హైకమాండ్‌కు గ్యాప్ కంటిన్యూ అవుతోందన్నారు. అందుకే మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినా కూడా రేవంత్‌ను పలకరించలేదని తెలిపారు.
బీసీలకు పనికి రాని శాఖలా?
రేవంత్ వ్యాఖ్యలు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేసేలా ఉన్నాయని బహిరంగగానే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పెట్టాలనే ఆలోచనతోనే చీఫ్ సెక్రటరీగా రామకృష్ణ నియామకం జరిగిందన్నారు. మంత్రులకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. రివ్యూస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి నివాసంలో పెట్టడంతో సీనియర్ మంత్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొన్ని శాఖల్లో రేవంత్ జోక్యం చేసుకోవడం మంత్రులకు నచ్చడం లేదని చెప్పుకొచ్చారు. భూముల వ్యవహారంలో సీఎం, రెవెన్యూ మినిస్టర్‌కు గ్యాప్ పెరిగిందని స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో అనుకూలం కంటే వ్యతిరేక మంత్రులే ఎక్కువ అని రేవంత్ భావిస్తున్నారని, అందుకే మంత్రి వర్గ విస్తరణను ముఖ్యమంత్రి ఆపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ రేవంత్‌కు ఇష్టం లేదన్నారు. తనకు అనుకూలమైన వారికి మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ లేదని, తన దగ్గరున్న ముఖ్యమైన శాఖలు కొత్త వారికి వెళ్తే .. ఆ శాఖలపై పట్టు పోతుందనే భయం రేవంత్‌కు పుట్టుకుందన్నారు. బీసీలకు పనికి రాని శాఖలు (దేవాదాయ , ఆర్టీసీ) ఇచ్చారని మండిపడ్డారు. మంత్రి పదవులపై ఆశావహులను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి రేవంత్ కన్ఫ్యూస్ చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చేశారు.