మహా: చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారయ్యాయి. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకంతో, ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఏడాది జూన్ నెల 8, 9 తేదీల్లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఆ రెండు రోజులూ అక్కడే ప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను బత్తిని కుటుంబ సభ్యులు పర్యవేక్షించనున్నారు.
సజావుగా సాగేందుకు..
ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సెంట్రల్ జోన్ డీసీసీ శిల్పవల్లి నేతృత్వంలో ఓ సమావేశం నిర్వహించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం 21 ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, నిర్వాహక సంస్థ, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖలవారీగా చర్చించారు. గత ఏడాది లోపాలను సమీక్షించి ఈసారి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీఐపీలు వచ్చినా సాధారణ జనాలకు ఇబ్బంది కలగకుండా ఈసారి ఎక్కువ సంఖ్యలో చేప ప్రసాదం పంపిణీ స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.








