Mahaa Daily Exclusive

  ఆధార్‌-ఈ సంతకం.. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ మ‌రింత స్పీడప్ ఇక 15 నిముషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సంతకం అమ‌లు – మంత్రి పొంగులేటి

Share

మహా: స్లాట్ బుకింగ్‌తోపాటు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా ఆధార్‌-ఈ సంతకం ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఆధార్‌-ఈ సంత‌కం వల్ల 10 నుంచి 15 నిముషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని అన్నారు. అవినీతిర‌హితంగా, పార‌ద‌ర్శ‌కంగా, స‌మయాన్ని ఆదా చేయాల‌నే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఆధార్ -ఈ సంతకం కూడా వీలైనంత త్వ‌ర‌గా అమ‌లులోకి తీసుకురావాలన్నారు. స‌చివాల‌యంలోని తన కార్యాల‌యంలో సోమ‌వారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఐజీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌తో క‌లిసి స్లాట్ బుకింగ్ విధానం, ప‌ని భారం అధికంగా ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అద‌న‌పు రిజిస్ట్రార్‌ల పోస్టింగ్‌, ప‌దోన్న‌తి పొందిన ఉద్యోగుల‌కు పోస్టింగ్‌ల‌పై సమీక్షించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో త‌క్ష‌ణమే అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్నామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప‌ఠాన్‌చెరువు, యాద‌గిరి గుట్ట‌, గండిపేట‌, సూర్యాపేట‌, జ‌డ్చ‌ర్ల ,మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, గద్వాల్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు అద‌నంగా ఎస్ ఆర్ వోల‌ను నియ‌మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.