Mahaa Daily Exclusive

  పాక్‌తో గూఢచర్యం సీఆర్‌పీఎఫ్ జవానును అరెస్టు చేసిన ఎన్ఐఏ..!

Share

న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. నిందితుడిని మోతీ రామ్ జాట్‌గా గుర్తించింది. మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్ అధికారులకు (పీఐఓలకు) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది. మోతీరామ్ జాట్‌ను ఢిల్లీలో అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. దేశ రక్షణలో బలగాల పాత్ర కీలకమైనదని, దేశ భద్రతను పణంగా పెట్టి గూఢచర్యానికి పాల్పడటం తీవ్రంగా పరిగణించాల్సిన వ్యవహారమని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. జూన్ 6 వరకూ నిందితుడిన ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత బలగాలు పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి దాడి చేయడం, అనంతరం పాక్ బలగాలు ప్రతిదాడులకు దిగడంతో భారత్ ఆ దాడులను తీవ్రంగా తిప్పికొట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అనుమానాస్పద గూఢచారులపై చర్యలకు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల అరెస్టు చేశారు. ఈనెలలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి గూఢచర్యం ఆరోపణలపై 12 మందిని అరెస్టు చేశారు.