ఆదిలాబాద్, మహా :
బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కాంగ్రెస్ నాయకులు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. కంపెనీ ఓనర్ దొర చెప్పినట్టు నడుచుకోవడమే మీ పని తప్ప మీరంటూ చేసిందేమీ లేదని విమర్శించారు.ప్రజాపాలనలో ఒక జిల్లా ఇంచార్జి మంత్రిగా ప్రజల సమస్యలను అధికార యంత్రాంగం పనితీరును సమీక్షించేందుకు వచ్చిన మంత్రి పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చిందని విమర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న గతంలో జిల్లాకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆదివారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగురామన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీనుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.పదేళ్లు మీకు అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మీ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించారు కాని ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షకోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కి యాభైవేల కోట్లు ఖర్చు చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.ఒక్క ఉద్యోగం లేదు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూం పథకం పూర్తిగా నిరుపయోగమన్నారు. ప్రజలకిచ్చిన ఒక్క హామీ కుడా నెరవేర్చలేదన్నారు.కాని తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అతి కొద్దిరోజుల్లోనే ప్రజా ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందిందన్నారు.ఆరు గ్యారెంటీల అమలుతో పాటు 60వేల ఉద్యోగాలిచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు.రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.అంతేకాకుండా సన్నబియ్యం పంపిణీ, రూ.9వేల కోట్ల రైతుభరోసా అందించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. పదేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లో చేసి చూపిందని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. అలాగే హైదరాబాద్ లో మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ ఎస్ నాయకుల దాడిని ఖండించారు.చట్టాలపై గౌరవమున్నవారు చేయాల్సిన పని కాదన్నారు. ఏది ఉన్నా న్యాయస్థానాలలో తేల్చుకోవాలి కాని ప్రత్యక్షదాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు.ఈ మీడియా సమావేశంలో నాయకులు గిమ్మసంతోష్ ,ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, మాజీ కౌన్సిలర్ సందా నర్సింగ్ ,రఫీక్,బూర్ల శంకరయ్య,రాజేశ్వర్ ,ఖయ్యూం,తోఫిక్, సాహెబ్ రావు,సిరాజ్,మోహిన్ తదితరులు పాల్గొన్నారు.








