ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి రాష్ట్రంలో గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆదివారం సాత్నాల మండలం సైద్ పూర్ లో తుమ్రం చంద్ర షావ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి వారు హాజరయ్యారు. గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం పార్టీలో చేరేందుకు వచ్చిన దాదాపు వంద మందికి కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా మాజీ మంత్రి జోగు రామన్న పని అయిపోయిందని చెప్పారు. పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రామన్న ఒక్క ఇల్లన్నా ఇచ్చిండా అని ప్రశ్నించారు. పాయల్ శంకర్ సెటిల్ మెంట్లు, భూ కబ్జాలు చేస్తారనే పేరు ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు కొన్ని కోట్ల విలువ గల భూములు కబ్జా చేసిరట్టు ఆరోపణలున్నాయన్నారు. జోగు రామన్న, పాయల్ శంకర్ లు వారి కుటుంబం గురించి ఆలోచిస్తారు తప్పితే ప్రజలకు చేసిందేమీలేదని తెలిపారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాని వారు బాధపడకూడదని రెండో జాబితాలో అర్హులైన అందరికి వస్తాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సన్నబియ్యం, యువతకు ఉద్యోగాలు, రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తోందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపించిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని మీరేమి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గిమ్మసంతోష్ ,సామ రూపేష్ రెడ్డి, అల్చెట్టినాగన్న తదితరులు హాజరయ్యారు.








