- సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
- హైకోర్టు స్టేపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం
- సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం
- రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లపై న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం
హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లనుంది. జీవో 9 అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6 శాతం ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం చీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
ఆ మూడు ఆప్షన్లపై ప్రభుత్వం చర్చలు..
హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి వచ్చింది. ఒకవేళ ఆ కాపీ వచ్చినా రాకపోయినా, మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడటమా? లేదా పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వడమా అనే మూడు ఆప్షన్లపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి.మాధవరెడ్డి, మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.






