- దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం
- బోరబండ డివిజన్లో సీతక్క విస్తృత ప్రచారం
హైదరాబాద్, మహా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఆమెకు అప్పగించిన బోరబండ డివిజన్లో మంగళవారం పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ (BRS) అబద్ధపు ప్రచారానికి తెరదించాల్సిన సమయం వచ్చిందని సీతక్క వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న రౌడీ షీటర్లు ఇప్పుడు మంచివాళ్లుగా మారిపోయారా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పదే పదే రౌడీ షీటర్ అన్న ముద్ర వేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ పక్కా లోకల్ నాయకుడు, ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆమె వ్యాఖ్యానించారు. “పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమి సాధించలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. ఇకపై మా కేబినెట్ను ‘దండుపాళ్యం బ్యాచ్’ అని పిలిస్తే ఊరుకోం.. గట్టిగా సమాధానం ఇస్తాం” అని సీతక్క హెచ్చరించారు. ఇక మరోవైపు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పూర్తిస్థాయిలో వేగవంతం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించగా, వారు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు







