దేశీయ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్.. బాంబు పేల్చింది. ఏకంగా సెబి ఛైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ను లక్ష్యంగా చేసుకుంది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మాధవి, ధవల్ బుచ్ దంపతులకు భారీగా వాటాలు ఉన్నాయని తెలిపింది. పరోక్షంగా- అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువల పెరగడానికి కారకులు అయ్యారని, వాటాలను కలిగివుండటం వల్ల వాళ్ల ఆస్తులనూ పెంచుకున్నారని ఆరోపించింది.
అదాని గ్రూప్కు చెందిన విదేశీ ఫండ్స్లల్లో మాధవి దంపతులకు అంతర్గత వాటాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రత్యేకించి బెర్ముడా, మారిషస్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ నివేదికను తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది హిండెన్బర్గ్ రిసెర్చ్ సంస్థ.
అదానీ గ్రూప్లో అనుమానిత ఆఫ్షోర్ షేర్ హోల్డర్లపై సెబి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి లబ్ది కలిగించేలా వ్యవహరించిన విషయాల్లో మాధవి బుచ్కు చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది హిండెన్ బర్గ్ సంస్థ.
మాధబి బుచ్ దంపతులు తొలిసారిగా 2015 జూన్ 5వ తేదీన సింగపూర్లో ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో తమ ఖాతాలను తెరిచినట్లు అంచనా వేసింది. ఇండియన్ బ్రోకరేజ్ కంపెనీ ఐఐఎఫ్ఎల్లో పెట్టుబడి పెట్టారని, అనంతరం వారి నికర ఆస్తుల విలువ 10 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు పేర్కొంది.







