- బీఆర్ఎస్ హైడ్రామా!
- దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపణ
- కృష్ణా నగర్ పోలింగ్ బూత్ దగ్గర మాగంటి సునీత ధర్నా
- ఆమెతో పాటు నిరసనకు దిగిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం
- మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి సహా పలువురు నేతల అరెస్ట్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ బై పోల్స్ ప్రశాంతంగా ముగిశాయినా పోలింగ్ అనంతరం హైడ్రామా నడిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. ఉదయం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన చిన్నపాటి ఘటనలు జరిగాయి. మరల అధికారులు వాటిని రిప్లేస్ చేశారు. మరోవైపు పలు చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికేతర ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్లో ఉండి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని అదే విధంగా ఓటర్లను ప్రభావితం చేసే పనుల్ని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటీ సునీత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణా నగర్ పోలింగ్ బూత్ దగ్గర ఫేక్ ఐడిలతో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. దీంతో కృష్ణా నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణానగర్, శ్రీనగర్ పరిధిలోని పలు పోలింగ్ బూత్లల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలను నకిలీ ఆధార్ కార్డులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని మాగంటి సునిత ఆరోపించారు. చివరి నిమిషంలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మాగంటి సునీత, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు.
పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్..
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేవారికి పోలీసులు సహకరిస్తున్నారంటూ మాగంటి సునిత వాగ్వివాదానికి దిగారు. పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చనిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అయితే సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసనపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల ఆందోళనతో భారీగా పోలీసుల మోహరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను చెదరగొట్టిన పోలీసులు, బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.







