- గేమ్ ఛేంజర్
- ఒంటి చేత్తో.. కాంగ్రెస్ ను గెలిపించిన సీఎం
- వ్యూహాత్మక ప్రణాళికతో బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాక్
- కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ అస్త్రాలు
(హైదరాబాద్ -మహా)
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ సంచలన విజయంకాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. భారీ విజయం వెనక సీఎం రేవంత్రెడ్డి మాప్టర్ ప్లాన్ ఎంతో పనిచేసిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సీఎం ఎత్తుగడలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధానంగా సీఎం సంధించిన ఆరు అస్త్రాలు కాంగ్రెస్ ఘన విజయానికి కారణమయ్యాయి. కేవలం వారంరోజుల్లోనే గ్రౌండ్ ను మార్చిన గేమ్ ఛేంజర్ గా రేవంత్ చరిత్ర లిఖించారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మక వైఖరితో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ చరిత్రలోనే గతంలో ఏ అభ్యర్ధికి ఇంత భారీ మెజార్టీ రాకపోగా అటు బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది.
1. మైనార్టీ మంత్ర
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ముందే గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపారు. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ను పోటీకి నిలిపితే చెమటోడ్చాలన్న అంచనా వచ్చారు. అజారుద్దీన్ను బరిలోకి దింపితే మైనార్టీ ఓట్లు వచ్చినా బీజేపీ చీలిక తెస్తే ఇబ్బంది అవుతోందని ముందే రేవంత్ రెడ్డి గ్రహించారు. తదనుగుణంగానే అధిష్ఠానాన్ని ఒప్పించి ఆయన్ను ఎమ్మెల్సీగా నియమిస్తూ క్యాబినెట్ తీర్మానం చేశారు. కానీ గవర్నర్ ఆమోదం లభించకపోవటంతో మైనార్టీల్లో అసంతృప్తిని గ్రహించిన రేవంత్రెడ్డి పోలింగ్కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు.
2. ఎంఐఎం మద్దతు కోరడంతో పాటు సాధించడంలో సఫలమయ్యారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ ల మద్దతును కోరి సాధించారు. వ్యూహాత్మకంగా టీడీపీ ఓటర్ల మద్దతు కూడా పొందారు.
3. బీసీ అభ్యర్ధి.. మైనార్టీ మద్దతు
పార్టీ అభ్యర్థిగా యువకుడు, స్థానికంగా అంగ, అర్ధబలం పుష్కలంగా ఉన్న నవీన్ యాదవ్ను ప్రకటించేలా అధిష్ఠానాన్ని ఒప్పించి మెప్పించారు. మైనార్టీ ఓట్ల ప్రాధాన్యత, ఎంఐఎంకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని నవీన్ యాదవ్ను సీఎం రేవంత్రెడ్డి అభ్యర్ధిగా ప్రకటించారు. నవీన్ యాదవ్ రాజకీయ జీవితం ఎంఐఎంలోనే ప్రారంభమైంది. ఇలా అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తపడిన ప్రచారంలోనూ తనదైన శైలి ప్రదర్శించారు.
4. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
పార్టీ ప్రచార బాధ్యతలను డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఆయనే దగ్గరుండి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు.
5. కార్నర్ మీటింగ్స్
సీఎం నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ విజయవంతమయ్యాయి. రెండేళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టారు. బీఆర్ఎస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా స్పందిచవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు. సోషల్ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టారు. స్వయంగా రోడ్ షోలు, ప్రెస్ మీట్లు, మీట్ ది ప్రెస్ వంటి కార్యక్రమాలను నిర్వహించి, ప్రచారాన్ని చివరి నిమిషం వరకు ఉధృతం చేశారు. సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారాన్ని పరుగులు పెట్టించారు.
6. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు హామీ
ఇక ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. దీనిలో భాగంగా తెలుగువారి ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇవ్వడం ద్వారా వారి సెంటిమెంట్ను ప్రభావితం చేయాలని చూశారు. దీని ద్వారా టీడీపీ శ్రేణులు -కూడా ఓ రకంగా కాంగ్రెస్ కు మద్దతు పలికారని చెప్పవచ్చు. మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు హామీతో పాటు బీఆర్ఎస్ పట్ల టీడీపీ క్యాడర్ కు ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకున్నారు.
7. సినీ కార్మికులకు వరాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం సినీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. సినీ కార్మికులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తుంటారు. అందుకే సీఎం సినీ కార్మికులు, పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలపై తమకున్న శ్రద్ధను చూపించి కీలక హామీలిచ్చారు. ఈ నియోజకవర్గంలో అనేక బస్తీలు, మురికివాడలు కూడా ఉన్నాయి. గత పదేళ్లలో అభివృద్ధి జరిగితే బస్తీల్లో సమస్యలు ఎందుకు ఉంటాయని రేవంత్ రెడ్డి ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఆ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి, బస్తీల్లోని పేద, మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించారు.
8. పోల్ మేనేజ్ మెంట్
పోల్ మేనేజ్ మెంట్, బూత్ ల వారీ నిర్వహణలో , ఓటర్లను బూత్ కేంద్రాలకు రప్పించి ఓట్లు వేసేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఏ అంశంలోనూ తగ్గేదెలే అని ప్రూఫ్ చేసుకున్నారు. ఆఖరిగంట దాకా పోలింగ్ తీరును సమీక్షించారు.








