Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌ వచ్చాకే సీమ లిఫ్ట్ ఆగింది :మంత్రి ఉత్తమ్

Share

హైదరాబాద్, మహా
పోలవరం-నల్లమల సాగర్‌ను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని, బీఆర్ఎస్ నేత​ హరీశ్‌రావు చూపిస్తున్న లేఖకు దీనికి సంబంధం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం-నల్లమల ఇంటర్‌స్టేట్‌ రూల్స్‌కు వ్యతిరేకమని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(జీఆర్‌ఎంబీ)కు లేఖ రాసినట్టుగా వెల్లడించారు. తమ అభిప్రాయంతో జీఆర్‌ఎంబీ కూడా సమర్థించిందన్నారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్‌ సింఘ్వికి సూచించామన్న ఆయన ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. అసెంబ్లీ విరామ సమయంలో ఉత్తమ్ మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు.

అతి తెలివితో రాష్ట్రానికి భారీ నష్టం చేశారు

రిట్‌ పిటిషన్‌లో కాదు, సూట్‌ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందన్నారు. వచ్చే విచారణకు తాను స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్న ఆయన గతంలో ఆగి ఉండే బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అతి తెలివితో బీర్ఎస్​ తెలంగాణకు భారీ నష్టం చేసిందని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం తెచ్చారని బీఆర్ఎస్​పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.