- వరంగల్ కోట భూములను కాపాడండి
- అక్రమ నిర్మాణాలను తొలగించండి
- ఆ భూములను భారత పురావస్తు శాఖకు చెందివనిగా గుర్తించాలి
- సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, మహా : వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని ేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కోట భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. సుమారు 250 ఏళ్ల పాటు కాకతీయుల రాజధానిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని, సాంస్కృతిక వైభవంతో అలరారిన వరంగల్ పట్టణం, తెలంగాణ వారసత్వ సంపదకు నిలయంగా విరాజిల్లుతోందని కిషన్రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ కోటను సందర్శించి ఇక్కడ ఉన్న శిల్ప సంపద, నిర్మాణ నైపుణ్యం, వందలాది ఆలయాలు, వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటారని కిషన్రెడ్డి గుర్తు చేశారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఏఎస్ఐ పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కిషన్రెడ్డి లేఖలో చెప్పుకొచ్చారు.
ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ 3 ప్రాకారాలతో పాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూములలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని కిషన్రెడ్డి ఆరోపించారు. వరంగల్ కోట ఏఎస్ఐ అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశమని, దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలను నిర్మించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారని కిషన్రెడ్డి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాను వరంగల్ జిల్లా కలెక్టర్కి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అక్రమ నిర్మాణాల విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. పైగా రెవెన్యూ రికార్డులలో కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవి అని కాకుండా ప్రభుత్వం అని పేర్కొన్నారని కిషన్రెడ్డి తెలిపారు. దీనితో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో భారత పురావస్తుశాఖకు అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.
వరంగల్ కోటకు చుట్టూ మట్టి గోడ, రాతి గోడ ఉన్నాయని. అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొత్త నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఇటీవల మట్టి గోడలోని కొంత భాగాన్ని ఆక్రమించారని తెలిపారు. వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేసి, వరంగల్ కోట భూముల్లో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించడంలో తగిన సహకారాన్ని అందించి, పురావస్తు శాఖ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ అధికారులు తనకు సూచించారని కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, వరంగల్ కోట పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటిని తొలగించాలని, ఆక్రమణకు గురైన కోట భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి తిరిగి ఏఎస్ఐకి స్వాధీనం చేయాలని కిషన్రెడ్డి కోరారు. ఆక్రమణదారుల మీద కఠిన చర్యలు తీసుకోని వరంగల్ కోట భూములను ఏఎస్ఐకి చెందినవిగా గుర్తించి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది భూ ఆక్రమణ సమస్య పరిష్కరించాలన్నారు. వరంగల్ వారసత్వ సంపద పరిరక్షణలో ఏఎస్ఐకి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున తాను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని కిషన్రెడ్డి లేఖలో వెల్లడించారు.








