మహా : అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. అలాగే మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజులను సైతం మార్చింది. దీనికి సంబంధించి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ వరకు ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫీజు పెంచినట్లు తెలిపింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసేందుకు ఈ అదనపు ఫీజులను వసూలు చేస్తారు. హెచ్ వన్ -బి, ఎల్ -1, ఓ-1, పి-1, టీఎస్ వీసాల (ఫారం I-129) అంశంలో ప్రీమియం ఫీజును పెంచనున్నారు. ఇక ఎఫ్-1, జె-1 లాంటి వీసాల (ఫారం I-539) విషయంలో చూసుకుంటే ఫీజును 1,965 నుంచి 2,075 డాలర్లకు పెంచారు. ఈ పెంపు నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు అందించేందుకు వినియోగిస్తామని యూఎస్ సిఎస్ఐ తెలిపింది. ఈ ఫీజు పెంపు నిర్ణయం ఇతర దేశాలతో పాటు భారత్కు చెందిన స్టూడెంట్స్, వృత్తి నిపుణులపై ప్రభావం పడనుంది.







