Mahaa Daily Exclusive

  ఇదే రాజకీయం..! ఉదయం బీఆర్ఎస్ లో చేరి, రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు..

Share

  • ఇదే రాజకీయం
  • ఉదయం బీఆర్ఎస్ లో చేరి, రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు
  • కోరుట్లలో ఓ నేత తీరుపై తీవ్ర చర్చ

 

కోరుట్ల, మహా : ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్‌ల గురించి ఎక్కువగా వినిపిస్తుంటుంది. వీరంతా గోడ మీద పిల్లి లాంటి వారు. ఏ పార్టీ అవకాశం ఇస్తానంటే అటు వైపు వెళ్తారు. కొందరు ఎన్నికల వరకు ఒక పార్టీలో ఉండి, తర్వాత అధికార పార్టీలోకి మారతారు. మరికొందరు టికెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగితే పార్టీ మారతారు. తాజాగా మునిసిపాలిటీలో కకౌన్సిలర్ టికెట్ కోసం ఒక వ్యక్తి ఒకే రోజు రెండు పార్టీలు మారాడు. ఉదయం కారు పార్టీలో చేరిన వ్యక్తి, రాత్రికి కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడు. ఈ ఆసక్తికర సంఘటన జగిత్యాలలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన తోట గంగాధర్ అనే వ్యక్తి 8వ వార్డు నుంచి పోటీ చేయాలని భావించి, గత కొన్ని రోజులుగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగాలని భావించిన గంగాధర్, పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మరో వ్యక్తి ప్రయత్నిస్తుండటంతో, తనకు టికెట్ రాదని భావించిన గంగాధర్ గురువారం ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం ఉదయం కోరుట్లలోని గంగాధర్ ఇంటికి వెళ్లి, అతడితో పాటు మద్దతుదారులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

గంగాధర్ పార్టీ మారిన విషయం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. గురువారం రాత్రికి గంగాధర్‌ను మెట్‌పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పిలిపించారు. 8వ వార్డు అభ్యర్థిగా టికెట్ అతడికే ఇస్తూ.. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ప్రకటన చేశారు. ఆతర్వాత గంగాధర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సంఘటనతో గంగాధర్ ఒక్క రోజులోనే రెండు పార్టీల మారిన నేతగా స్థానికంగా సంచలనం సృష్టించారు.