హైదరాబాద్, మహా : ఇటీవల చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చానీయంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కన్నతల్లి, కడుపున పుట్టిన బిడ్డల మరణం వర్ణించలేనంత మానసిక వేదనను కలిగించింది. ఈ ‘అమ్మ రాజీనామా’ సంఘటన సమాజం అంతరాత్మను కదిలించాలి, లేదంటే మన సామూహిక జీవన విధానానికే అర్థం లేకుండా పోతుంది’ అని పేర్కొన్నారు. జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి అని ఈటల ప్రజలకు సూచించారు. మరణం దేనికీ పరిష్కారం కాదని, అది కేవలం ఒక తీరని శూన్యం మాత్రమేనని అన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ‘ఆత్మనిర్భరత’తో పోరాడదాం.. చుట్టూ ఉన్న పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుందామని కోరారు. బ్రతుకు విలువ తెలుసుకుందాం.. ఆఖరి వరకు జీవిద్దాం.. అని పిలుపునిచ్చారు. బోడుప్పల్ నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విజయశాంతి రెడ్డి (38) తన ఇద్దరు పిల్లలతో తనువు చాలించడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.








