Mahaa Daily Exclusive

  కారేపల్లిలో దొంగనోట్ల కలకలం… 

Share

కారేపల్లిలో దొంగనోట్ల కలకలం…

 

*చిట్టీ వ్యాపారుల దందా పై కన్నేసిన పోలీసులు

 

*కారేపల్లి మండలంలో నెలసరి రూ.50 కోట్లకు పైబడే అక్రమ వ్యాపారం

 

*అనుమతులు లేకుండా అడ్డగోలుగా చిట్టీలు, గిరి గిరి, ఫైనాన్స్…

 

కారేపల్లి, మహా:కారేపల్లిలో దొంగనోట్ల చలామణి వ్యవహారం వ్యాపార వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. మూడు రోజుల క్రితం బ్యాంక్ అధికారులు గుర్తించిన దొంగ నోటు వ్యవహారం బయటికి రావడం అదికూడా ఓ ప్రైవేట్ చిట్టీ వ్యాపారి వద్ద నుంచి చలామణి అయిందనే ఆరోపణ పై విస్తృతంగా చర్చ జరగడంతో ఇంటిలిజెన్సీ తో పాటు కారేపల్లి పోలీసులు కూడా వివరాలు తెలుసుకునే పనులు చేపట్టారు. కారేపల్లి బీసీ కాలనీకి చెందిన ఓ చిట్టి వ్యాపారిని పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు కూడా సమాచారం.. కారేపల్లి కేంద్రంగా మండల వ్యాప్తంగా అనుమతులు లేకుండా చిట్టీలు, గిరి గిరి, ఫైనాన్స్, గ్రూపు లోన్ల పేరుతో నెలసరి 50 కోట్ల రూపాయలకు పైబడి అక్రమ దందా నడుస్తోంది.. ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో కొందరు దొంగ నోట్ల చలామణి కూడా సులువుగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా బ్యాంక్ అధికారులే గుర్తించిన ఫేక్ నోట్ చిట్టీలు నడిపే వ్యక్తినుంచే రావడంతో కారేపల్లిలో నడుస్తున్న అక్రమ దందాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భారీ స్థాయిలో అక్రమ దందా నడుస్తున్నప్పటికీ నిఘా వర్గాలు వీటిపై దృష్టి సారించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అనుమతులు లేని అక్రమ వ్యాపారాలు బహిరంగంగానే జరుగుతున్నా నియంత్రించాల్సిన యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ నోట్లు కలకలంతో వ్యాపార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. దుకాణాలకు వచ్చిన ప్రతి నోటును క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టుబడ్డ నోటు కూడా బయట గుర్తించలేని విధంగా ఉండడంతో వ్యాపార వర్గాల ఆందోళన చెందుతున్నాయి.

*నిఘా నిద్రపోతుంటే… దగా దండుకుంటుంది…

అక్రమ వ్యవహారాలను నియంత్రించాల్సిన నిఘా విభాగాలు నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలకు తెరలేపిన దగా కోరులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మండల వ్యాప్తంగా అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

*ఆంధ్రా ముఠాల ఫైనాన్స్ ఆగడాలు…

మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పేద మధ్యతరగతి గిరిజనుల అవసరాలను ఆసరాగా తీసుకొని ఆంధ్ర నుంచి వచ్చిన ఫైనాన్స్ ముఠాల అక్రమ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. వారాల వసూళ్లతో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఈ ముఠాలు గ్రామాల్లో ఫైనాన్సు చేస్తున్నాయి.

*అక్రమ దందాపై పోలీసులు దృష్టి సారించాలి…

కారేపల్లి మండలంలో అక్రమంగా నడుస్తున్న దందాల పై పోలీస్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కొత్తగా వచ్చిన డైనమిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎన్నో క్లిష్టమైన కేసులను చేదించి పోలీస్ శాఖలో మంచి పేరు కూడా సాధించారు. అదే స్ఫూర్తితో ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ దందాపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే అనేక అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు కోరుతున్నారు.

Latest