- దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్
- ఏ మాత్రం తగ్గని అమెరికా
- భారీ ఆయుదాలతో దాడులు
- కనిపించని ఇరాన్ కొత్త సుప్రీం
మహా : ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు అమెరికా ప్రత్యక్ష జోక్యంతో పూర్తి స్థాయి యుద్ధంగా మారాయి. గత 24 గంటల్లో ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ లక్ష్యాలపై విరుచుకుపడింది. అదే సమయంలో గల్ఫ్ లోని ఇతర దేశాలనూ టార్గెట్ చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. ఇరాన్లోని ఖార్గ్ ద్వీపంలో ఉన్న సైనిక లక్ష్యాలను తమ దళాలు ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలపై కూడా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఎవరికీ కనిపించని ఇరాన్ కొత్త సుప్రీంలీడర్
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కోమాలో ఉన్నారని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. కానీ ఇరాన్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆయన పేరుతో ఇరాన్ మీడియా ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తండ్రి ఆశయాలకు అనుగుణంగా అమెరికా ప్రభావాన్ని మధ్యప్రాచ్యం నుంచి తరిమికొట్టడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా స్పందిస్తూ, రాబోయే రోజుల్లో మరింత ఖచ్చితత్వంతో కూడిన, విధ్వంసకర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించింది.
గల్ఫ్ దేశాలపై ప్రభావం
యుద్ధం కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు కూడా పాకింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు ఇరాన్ ప్రయోగించిన ఏడు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అలాగే, దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ,దోహాలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేస్తోంది.
విమాన సర్వీసులకు ఆటంకం
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల మీదుగా విమాన ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్, ఖతార్, టెహ్రాన్ విమానాశ్రయాల నుంచి నడిచే అనేక అంతర్జాతీయ విమానాలు రద్దు చేశాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. అయితే, భారత్తో ఉన్న సంబంధాల దృష్ట్యా కొన్ని భారతీయ నౌకలకు మాత్రం ఈ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి నిచ్చినట్లు తెలుస్తోంది.
భారతీయుల తరలింపు
యుద్ధ తీవ్రత దృష్ట్యా మధ్యప్రాచ్యంలో ఉన్న భారతీయుల రక్షణపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సుమారు 52,000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, అమెరికా తన రక్షణ కోసం అదనంగా 2,500 మంది మెరైన్లను, యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు తరలించింది. ఐక్యరాజ్యసమితి దళాల స్థావరాలపై కూడా దాడులు జరగడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉండటంతో, రాబోయే కొన్ని రోజులు మధ్యప్రాచ్య భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మేము ఇంకా పని పూర్తి చేయలేదు అని హెచ్చరించడం, యుద్ధం మరింత కాలం కొనసాగే సూచనలను ఇస్తోంది.








