Mahaa Daily Exclusive

  ఆన్‌లైన్ జూదం కోసం జంట హత్యలు.. సీఎం నివాసం సమీపంలో డ్రైవర్ ఘాతుకం.

Share

  •  సీఎం నివాసం సమీపంలో డ్రైవర్ ఘాతుకం.
  •   వృద్ధురాలిని చంపి.. ఆ నగలతో పేకాట.
  •   డబ్బులు ఓడిపోవడంతో మరో హత్య.
  •   శవాలను కారులోనే తీసుకెళ్లి మోకిలలో పారవేసిన వైనం.
  •   నిందితుడు వైద్యుడి వద్ద పనిచేసే డ్రైవర్..
  •   నిగ్గుతేల్చిన ఫిల్మ్‌నగర్ పోలీసులు

హైదరాబాద్‌, మహా .

ఆన్‌లైన్ పేకాట వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, మరో ఘోరానికి తెగబడేలా చేసింది. పైసా ఖర్చు లేకుండా విలాసాలకు అలవాటుపడిన ఓ కారు డ్రైవర్, ఆన్‌లైన్ జూదంలో పోగొట్టుకున్న డబ్బు కోసం ఏకంగా ఇద్దరు వృద్ధులను దారుణంగా హత్య చేసిన ఉదంతం నగరంలో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలోనే ఈ అరాచకం చోటుచేసుకోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మొదటి హత్య: నగలతో ఆన్‌లైన్ జూదం

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వాసు ఆన్‌లైన్ పేకాటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం గత నెల 11న యాదమ్మ అనే వృద్ధురాలికి కారులో లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెను దారుణంగా హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నాడు. ఆ నగలను తాకట్టు పెట్టగా వచ్చిన రూ.26,500తో ఆన్‌లైన్ పేకాట ఆడాడు. అయితే, ఆ డబ్బును కూడా జూదంలో పూర్తిగా పోగొట్టుకున్నాడు.

మరో ప్రాణం బలి..

మొదటి హత్య ద్వారా వచ్చిన డబ్బు పోవడంతో, తిరిగి జూదం ఆడేందుకు వాసుకు మళ్లీ డబ్బు అవసరమైంది. దీంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంటే.. ఫిబ్రవరి 14న మంగమ్మ అనే మరో వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమెను కూడా మొదటి బాధితురాలి తరహాలోనే హతమార్చి, నగలను కాజేశాడు. పట్టపగలే అత్యంత సాహసంతో కారులో శవాలను ఉంచుకుని, నగరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలా ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పారేశాడు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు

వృద్ధుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వాసు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. శవాల మీద నగలు తీసుకుని వాటితో జూదం ఆడానని నిందితుడు ఒప్పుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో, పైగా ఉన్నత స్థాయి భద్రత ఉండే సీఎం నివాస పరిసరాల్లోనే ఈ హత్యలు జరగడం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తోంది. పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి, కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Latest