ఉప ముఖ్యమంత్రి పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన మాట నిలబెట్టుకోవటం కోసం సొంత నిధులు రూ 60 లక్షలు ఖర్చు చేసారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె లో పాఠశాలకు క్రీడామైదానం కోసం స్థలం కొనిస్తానని మాట ఇచ్చారు. రూ.60 లక్షల సొంత డబ్బుతో ఎకరం స్థలం కొనుగోలు చేసి మైసూరివారిపల్లె పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
రూ 60 లక్షల విరాళం
డిప్యూటీ సీఎం పవన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆగస్టు 23న మైసూరివారిపల్లెలో జరిగిన గ్రామసభలో అక్కడ క్రీడా మైదానం కోసం స్థలం కొనిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దీని కోసం రూ 60 లక్షల సొంత నిధులతో ఎకరం స్థలం కొనుగోలు చేసి మైసూరివారిపల్లె పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్కలెక్టర్ నిధియాదేవి సమక్షంలో మైసూరివారిపల్లె సర్పంచ్ సంయుక్తకు అందజేశారు. దీంతో, ఆ గ్రామంలో వెంటనే క్రీడా మైదానంకు అవసరమైన విధంగా తీర్చి దిద్దాలని అధికారులకు పవన్ సూచించారు.
నాడు ఇచ్చిన హామీ మేరకు
మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సమయంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో, దసరా లోగానే అక్కడ ఆట స్థలం ఏర్పాటు చేస్తామని నాడు పవన్ హామీ ఇచ్చారు. దీంతో, ఆ మాట మేరకు తన సొంత ట్రస్టు నిధుల నుంచి రూ 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్లు పవన్ వెల్లడించారు. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయని పవన్ పేర్కొన్నారు. మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవని.. తన ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ పేర్కొన్నారు.
భవిష్యత్ లోనూ కొనసాగింపు
ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఆట స్థలాలు లేని పాఠశాలలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. పవన్ రాజకీయాల్లోకి రాక ముందే ఎన్జీవోగా ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టారు అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఆ సంస్థ ఉద్దేశం. ఇప్పుడు పవన్ విరాళం ఇచ్చిన మైసూరా పల్లిలో ఆట స్థలం కోసం మిగిలిన మొత్తాన్ని ఇతర దాతల నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు. పవన్ సొంత నిధులతో చొరవ తీసుకోవటం పైన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








