ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టు నోటీసులు.
* స్పీకర్ తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశం.
* కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం అసంతృప్తి.
* తదుపరి విచారణ జులై 22కు వాయిదా.
హైదరాబాద్, మహా.
పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. సదరు శాసనసభ్యులు పార్టీ ఫిరాయించలేదంటూ శాసనసభ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు తాలూకు కాపీలను తక్షణమే తమ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా.. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు, అసెంబ్లీ స్పీకర్ కూడా తమ పూర్తి వాదనలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు మరోమారు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈ కేసు వ్యవహారంలో న్యాయస్థానం గతంలోనే వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇంతవరకు ఎవరూ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరూ తప్పనిసరిగా కౌంటర్లు సమర్పించాలని స్పష్టం చేస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల (జులై) 22వ తేదీకి వాయిదా వేసింది.








